“ఖబడ్దార్ ….నువ్వు..నీ కొడుకు. మీ ఇద్దరూ చట్టానికి అతీతులు అనుకొంటున్నారా ..మిమ్మల్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా … మా జనసైనికులు తిరగబడితే పది నిముషాలు చాలు..మీ కొడుకుని అదుపులో పెట్టుకోండి..లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు .” అంటూ పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అతని కుమారుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. దళితుల భూములను లాక్కోవడమే కాకుండా వారిపై దాడులకు తెగబడుతున్న పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అతని కుమారుడు ఇద్దరూ ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.పెందుర్తి నాలుగురోడ్ల కూడలిలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు.దళితులపై దాడులు..భూకబ్జాల కోసమే మీకు అధికారం ఇచ్చామనుకొంటున్నారా అని ప్రశ్నించారు. మీరేమీ చట్టానికి అతీతులు కారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నాలుగేళ్లుగా అధికారం వెలగబెడుతూ పెందుర్తిలో కనీసం డిగ్రీ కాలేజీ కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు.ఇదేనా యువత పట్ల మీకున్న బాధ్యత అని ప్రశ్నించారు..స్టీల్ ప్లాంట్ ,ఎంటీపీసీ తదితర సంస్థల లారీల వలన నిత్యం ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతుంటే వాటి నివారణకు కనీస చర్యలు తీసుకోవడానికి మీకు ఖాళీ లేదా …సిమాచలం భూవివాదంతో స్ధలాలు ఉండీ అనుభవించలేకపోతున్న మధ్యతరగతి ప్రజలు,రైతులు మీకు కనపడటం లేదా అని ప్రశ్నించారు.
జనసేన అభిమానులు ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసుకొంటే తొలగించారు…కానీ వారి గుండెల్లో నుంచి జనసేన ను తీయలేరు అని అన్నారు.మాకూ ఒక రోజు వస్తుంది ..ఆ రోజు చూసుకొందామన్నారు.ఈ బహిరంగ సభలో జనసేన నాయకులు బాలాజీ విద్యాసంస్థల అధినేత బాలాజీ రవి,వేగి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.