కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చంజర్ల వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా… మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు, పోలీసులు బయటకు తీశారు. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సును ఢీకొన్న లారీ అంతటితో ఆగకుండా బస్సు వెనుకే వస్తున్న రెండు ద్విచక్రవాహనాలను సైతం ఢీకొంది. దీంతో వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బస్సును.. కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొంది. రెండు లారీలు ఒకదానికొకటి ఓవర్టేక్ చేసుకుంటూ రావడంతో ఓ లారీ అదుపుతప్పి బస్సును మధ్య భాగంగా ఢీకొంది. దీంతో వెనుక భాగం తునాతునకలైంది. ఆ సీట్లలో కూర్చున్న ప్రయాణికుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ప్రాంతంలో మృతుల శరీర భాగాలు, రక్తంతో భయానక పరిస్థితి నెలకొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లారీ అతివేగంతో రావడం, రహదారి మధ్యలో డివైడర్ లేకపోవడమే ఈ ప్రమాదానికి పోలీసులు చెబుతున్నారు.