నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉభయ సభల సెక్రటేరియట్లకు తెలిపింది.
వివిధ బిల్లులతో పాటు ప్రభుత్వం రెండు ప్రతిష్టాత్మక ఆర్డినెన్సులకు చట్టం రూపు ఇవ్వాలని పట్టుదలగా ఉంది.
నూతన, దేశీయ తయారీ కంపెనీలకు కార్పొరేట్ పన్ను తగ్గించడం ఇందులో మొదటిది.
ఆర్ధిక మందగమనానికి చెక్ పెట్టడంతో పాటు అభివృద్ధికి ఊతమివ్వడం దీని లక్ష్యం.
ఫైనాన్స్ చట్టం 2019, ఆదాయ పన్ను చట్టం 1961కి సవరణలు చేస్తూ సెప్టెంబర్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.
కాగా రెండోది ఈ-సిగరెట్ల నిషేధం. దీన్ని కూడా గత నెలలోనే తీసుకొచ్చారు.
దీని ప్రకారం.. ఈ సిగరెట్లు, వీటి తరహా ఉత్పత్తుల తయారీ, అమ్మకం, నిల్వ పూర్తిగా నిషిద్ధం.
కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీల ఖరారు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ నెల 16న పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైన సంగతి తెలిసిందే.