భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమర యోధులకు నివాళులర్పించారు.
దేశ ప్రజలందరినీ అభినందించారు. రైతులు, పోలీసులు, సైనికులు, ప్రజలు తమ తమ రంగాల్లో విశేష కృషి చేస్తూ, దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారన్నారు.
ఆగస్టు 15 ప్రతి భారతీయుడికీ అత్యంత పవిత్రమైనదని తెలిపారు.
త్రివర్ణ పతాకం మన దేశానికి ప్రతినిథి అని చెప్పారు.
మన పూర్వీకులు, స్వాతంత్ర్య సమర యోధులు ఎన్నో త్యాగాలు చేశారని, దాని ఫలితంగానే మన దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు.
మన సమాజంలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు.
మహిళలు తమకు నచ్చిన మార్గాన్ని ఎంపిక చేసుకునే అవకాశం, స్వేచ్ఛ ఉండాలన్నారు.
నారీమణులు తమ ప్రతిభాపాటవాలతో కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, ఉద్యోగం చేయాలనుకున్నా, విద్యా రంగంలోనైనా సరైన అవకాశాలు అందుబాటులో ఉండాలని తెలిపారు.
ఒక వరుసలో కొందరు ఉన్నపుడు వెనుకనున్నవారు తమ ముందు ఉన్నవారి హక్కులను గౌరవించి, తమ వంతు వచ్చే వరకు వేచి చూడగలగాలని, ఆ విధంగా వేచి చూడగలిగేవారే స్వాతంత్ర్య సమర యోధులు కలలుగన్న భారతదేశాన్ని సృష్టించగలుగుతారని తెలిపారు.
ఈ విధంగా చేయడం కష్టం కాదని, చాలా చిన్న ప్రయత్నమని చెప్పారు.
దీనిని మన జీవితాల్లో భాగం చేసుకోవాలని తెలిపారు.
సైనికులకు మెరుగైన ఆయుధాలను అందజేయగలిగినపుడు, మన దేశంలోనే రక్షణ పరికరాలను అభివృద్ధి చేసుకోగలిగినపుడు, సైనికుల సంక్షేమానికి చర్యలు తీసుకోగలిగినపుడు మన స్వాతంత్ర్య సమర యోధులు కలలు కన్న భారతదేశం సాధ్యమవుతుందన్నారు.
నేడు మన దేశంతోపాటు మనం ఎక్కడ ఉన్నామో నిర్ణయించి చెప్పే అంశాలను రాష్ట్రపతి వివరించారు.
తక్షణ భవిష్యత్తు కోసమైనా, మధ్యకాలిక ప్రయోజనాల కోసమైనా సరే, మన దేశం నేడు తీసుకునే నిర్ణయాలు, వేసే పునాదులు, చేపట్టే ప్రాజెక్టులు, సాంఘిక, ఆర్థిక రంగాల్లో పెట్టే పెట్టుబడులు మన స్థానాన్ని నిర్ణయిస్తాయన్నారు.
భారతీయత కేవలం మన కోసం మాత్రమే కాదన్నారు. మన దేశం, మన నాగరికత ప్రపంచ వేదికపై నిలిపిన దానిలో భారతీయత ఓ భాగమని తెలిపారు. భారతదేశం భారతీయులదని తెలిపారు.
మన దేశం కేవలం ప్రభుత్వానికి సంబంధించినది కాదన్నారు.
మనమంతా కలిసి మన దేశంలోని ప్రతి పౌరుడికి సహాయపడదామని పిలుపునిచ్చారు.
భావి తరాల కోసం మనమంతా కలిసి అడవులను, సహజ వారసత్వాన్ని, విలువైన కట్టడాలను పరిరక్షించాలన్నారు.