రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కాన్ఫరెన్సులో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వరదలతో కేరళ కకావికలం అయ్యిందని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోనూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందును లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రాణ నష్టం నివారించడంతో పాటు ఆస్తి నష్టం తగ్గించాలని సూచించారు.
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
అన్ని ప్రాంతాలలో లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉంచాలన్నారు.
సంక్షోభాల్లోనే మన సామర్ధ్యం బయటపడుతుందని, అధికారులు, సిబ్బంది సమన్వయంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు.
అవనిగడ్డలో పాముకాట్లపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
అన్ని ఆసుపత్రులలో యాంటి వీనమ్ సీరమ్ నిల్వ ఉంచుకోవాలన్నారు.
ప్రస్తుతం కీలక సమయమని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
బుట్టాయగూడెంలో వరదల్లో చిక్కుకున్న భక్తులపైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు.
భక్తులు అందరూ సురక్షితంగా ఉన్నారని. వారి వెంట పోలీసులు ఉన్నారని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ తెలిపారు.
కొండవాగుల ఉద్ధృతిపై కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు.
తప్పిపోయిన ఒక భక్తుడిని కూడా అగ్నిమాపక సిబ్బంది కాపాడారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
వరద బాధితులకు సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని, బాధితులకు ఆహారం, మందులు పంపిణీ చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశంచారు.