Indian Red Cross Society Presentation of Awards,Visakhapatnam,Vizag Vision…విశాఖపట్నంలో ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు, రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ సతీసమేతంగా హాజరై రాష్ట్రంలో రెడ్క్రాస్ సొసైటీకి సేవలందించిన అధికారులకు, స్వచ్చంద సేవకులకు పథకాలను, సేవా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ సేవే పరమావధిగా భావిస్తూ ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి కృష్ణాజిల్లా నుండి కోటి రూపాయలు సభ్యత్వ విరాళాలుగా సేకరించి అందించామని తెలిపారు. దేశంలోనే ఏ జిల్లాలో చేయని విధంగా కోటి రూపాయలు రెడ్క్రాస్ సొసైటీకి అందించి కృష్ణాజిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర గవర్నరు చేతుల మీదుగా బంగారు పథకాన్ని, రూ.10 లక్షలు నగదు అవార్డును, షీల్డ్ను అందుకోవడం కృష్ణాజిల్లాకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కృష్ణాజిల్లా శాఖ బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తూ ఎంతోమందికి అత్యవసర పరిస్థితుల్లో రక్తదానాన్ని అందిస్తూ వారి నిండైన జీవితాలను కాపాడుతుందన్నారు. జిల్లాలోని అధికారులు, స్వచ్ఛంద సేవకులు, విద్యార్థులు అనేకమంది ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యకలాపాల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని కలెక్టరు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నుండి రెడ్క్రాస్ అవార్డులు అందుకున్నవారిలో డాక్టర్ శ్రీధర్, నూజివీడు ఆర్డీవో సీహెచ్ రంగయ్య, జగ్గయ్యపేట తహశీల్దారు చంద్రశేఖర్, గన్నవరం తహశీల్దారు యం.మాధురి, డాక్టర్ అచ్చెయ్కుమార్, టి.వి.హనుమంతరావు తదితరులు ఉన్నారు. రాష్ట్రస్థాయి అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో గవర్నరు సతీమణి విమలా నరసింహన్, రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ గౌరవాధ్యక్షురాలు రేచల్ చటర్జీ, ప్రిన్సిపల్ సెక్రటరి టూ గవర్నరు హరిప్రీత్సింగ్, జనరల్ సెక్రటరీ యస్.బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.