ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు సరైన పౌష్టికాహారాన్ని అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివృద్ధికి పునాది పండుతుందన్న ఆయన, ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలో ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పౌష్టికాహార లోపం ఓ సవాల్గా మారిందని, దీన్ని అధిగమించడం ద్వారానే దేశ భవిష్యత్ అయిన చిన్నారులను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని తెలిపారు. సరైన పోషకాహారం అందకపోవడం ద్వారా చిన్నారుల శారీరక, మేధో వికాసానికి ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల్లో పౌష్టికాహార సమస్యలు రాకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయన్నఉపరాష్ట్రపతి, ఈ మహత్కార్యంలో స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సహా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.