పోర్ట్ లో 55వ జాతీయ భద్రతా దినోత్సవం – డాక్ సేఫ్టీ వీక్ ముగింపు కార్యక్రమం
55వ జాతీయ భద్రతా దినోత్సవం – డాక్ సేఫ్టీ వీక్ ముగింపు కార్యక్రమం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ పరిపాలనా భవనంలోని శ్రీ సంబమూర్తి ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
మార్చి 4 నుంచి 10 వరకు నిర్వహించిన డాక్ సేఫ్టీ వీక్ సందర్భంగా… భద్రతపై అవగాహన పెంపు, అత్యవసర పరిస్థితులకు సంసిద్ధత , మరియు పోర్ట్ భాగస్వాముల భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ఎం. అంగముత్తు, IAS, చైర్మన్ హాజరయ్యారు. గౌరవ అతిథిగా శ్రీమతి కె. రోష్ని అపరంజి, IAS, ఉపాధ్యక్షురాలు మరియు పోర్ట్ సేఫ్టీ కమిటీ చైర్పర్సన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ, పోర్ట్ కార్యకలాపాలలో భద్రతా ప్రమాణ నిర్వహణ విధానాలు (SOPs) మరియు నిబంధనలను కచ్చితంగా పాటించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. డాక్ సేఫ్టీ వీక్ సందర్భంగా భద్రతా బృందం నిర్వహించిన అవగాహన మరియు భాగస్వామ్య కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు.
ఈ సందర్భంగా, ఆధునిక మరియు సమర్థవంతమైన భద్రతా శిక్షణ విధానాలను అవలంబిస్తున్న పోర్ట్ తన సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ డిజిటల్ డాక్ సేఫ్టీ ట్రైనింగ్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ టి. అరుణ్ ప్రసాద్, IES, విభాగాధిపతులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు మరియు టెర్మినల్ ఆపరేటర్ల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, పోర్ట్ కార్యకలాపాలలో ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించడానికి తమ తమ సన్నద్ధతను తెలియజేశారు.
















