Sri Indrakeeladri Amma Shakambari Festivals on July 3rd to 5th in Vijayawada,Vizagvision…
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు ఆషాడ మాసం సందర్బముగా ప్రతి సంవత్సరము మాదిరిగా ఈ సంవత్సరము కూడా శ్రీ అమ్మవారికి జూలై-3 నుండి జూలై-5 వరకు శాకంబరి ఉత్సవాలు జరుపుటకు నిర్ణయించడమైనది.
ప్రభుత్వ ఆదేశముల మేరకు శ్రీ అమ్మవారి దర్శనార్ధం విచ్చేయు భక్తులు దేవస్థాన వెబ్ సైటు నందు టైం స్లాట్ ప్రకారము టిక్కెట్టు తీసుకొని మహామండపము మార్గము ద్వారా సామాజిక దూరం పాటిస్తూ , మాస్కులు ధరించి, చేతులు శానిటైజేషన్ చేయుచూ రావలసియుండును.
సిబ్బంది మరియు భక్తులు యావన్మంది సామాజిక దూరం పాటించవలసియున్నది. కావున ఎక్కువమంది తో కాకుండా తక్కువ మంది సిబ్బందిని వినియోగించుటకు నిర్ణయించడమైనది.
ప్రస్తుత పరిస్థితుల దృష్జ్ట్యా మొదటి 2 రోజులు సాధారణ అలంకారము(అంతరాలయము నందు) చేయుటకు మరియు మూడవ రోజు అమ్మవారి ముఖమండపము నుండి ద్వజస్తంభం వరకు కూరగాయలు అలంకారము ఏర్పాటు చేయబడును.
శాకంబరి ఉత్సవములలో ది:3-7-2020న ఉదయం 8-00 గం.లకు గణపతి పూజతో ప్రారంభించి వైదిక కార్యక్రమములు అనగా చండీహోమం మరియు మూలమంత్ర హవనం లు జరిపించి ది:5-7-2020 న 11-00 గం.లకు పూర్ణాహుతి తో కార్యక్రమం ముగియును.
భక్తులు స్వచ్చందముగా ఇచ్చు కాయగూరలు తీసుకొనుటకు గాను మహామండపము ప్రక్కన ఉన్న షెడ్డు నందు కౌంటరు ఏర్పాటు చేయబడును.
శ్రీ అమ్మవారి దర్శనమునకు వచ్చు భక్తులకు ప్రసాదముగా కదంబ ప్రసాదము ఏర్పాటు చేయబడును.
శ్రీ అమ్మవారి అలంకారమునకు కావలసిన కూరగాయలు దాతల నుండి సేకరించుటకు కమిటీని ఏర్పాటు చేయబడును.
ఆషాడ మాసము సందర్బముగా తెలంగాణా రాష్ట్రము బోనముల కమిటీ వారు తేది:5-07-2020 న ఉదయం శ్రీ అమ్మవారికి బోనములు సమర్పించుటకు విచ్చేయుదురు.
శ్రీ శార్వరీ నామ సంవత్సర ఆషాడ శుద్ద పాడ్యమి ది:22-6-2020 సోమవారం నుండి ఆషాడ అమావాస్య 20-7-2020 సోమవారము వరకు అనగా నెలరోజులు పాటు శ్రీ అమ్మవారికి సారెను సమర్పించుట వలన భక్తులకు శ్రేయోదాయకమని తెలియజేయడమైనది.
శ్రీ అమ్మవారికి అషాడం సారె సమర్పించ దలచిన భక్తులు ప్రతి రోజు ఉదయం 6 గం.ల నుండి సాయంత్రం 5-00 గం.ల వరకు ఆన్ లైను ద్వారా టైం స్లాట్ ప్రకారము దర్శనం టిక్కెట్లు తీసుకొని గుంపులు గుంపులుగా కాకుండా మహామండపం ద్వారా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, శానిటైజేషన్ జాగ్రత్తలు పాటిస్తూ క్యూ-మార్గము ద్వారా రావలసి యుండును. గుంపులు గా వచ్చిన వారిని అనుమతించబడదు.
శ్రీ అమ్మవారికి సమర్పించు చీరలు దర్శనము అనంతరం దేవస్థానము కౌంటరు నందు సమర్పించి రశీదు పొందగలరు. అట్లు రశీదు పొందిన చీరలు మాత్రమే శ్రీ అమ్మవారికి చెందును.
దేవస్థానము నందు పనిచేయు యావన్మంది సిబ్బంది వారికి అనగా అర్చకులు, సెక్యులర్ సిబ్బంది, సెక్యూరిటీ, ఎస్.పి.ఎఫ్., హోమ్ గార్డులు, స్వీపర్లు సుమారుగా 920 మందికి కోవిడ్-19 టెస్టులు చేయించుట జరిగినది.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆలయము నందు 55 సంవత్సరము లపైబడిన వారిని విధులకు దూరముగా ఉంచుట జరిగినది.
భక్తులు కోరిక మేరకు శ్రీ అమ్మవారి ఆలయము నందు తేది:1-7-2020 నుండి ఖడ్గమాలార్చన -4 పూజలు ముఖమండపము నందు (ఉదయం 4-30 ని.ల లకు) , శ్రీచక్రనవావర్ణార్చన-5 (ఉదయం 7-30 ని.లకు) టిక్కెట్లు జరిపించుటకు నిర్ణయించడమైనది.
భక్తుల సౌకర్యార్ధం దేవస్థాన కేశఖండన శాల నందు తలనీలాలు తీయుటకు గాను తేది:1-7-2020 నుండి ప్రారంభించుటకు నిర్ణయించడమైనది. 10 సంవత్సరముల లోపు పిల్లలకు మరియు 60 సంవత్సరములు పైబడిన వారికి అనుమతించబడదు. టైం స్లాట్ ప్రకారము గంటకు 90 టిక్కెట్లు ఇచ్చుటకు మరియు రోజుకి 30 మంది నాయిబ్రాహ్మణులతో మాత్రమే విధులు నిర్వహించుటకు నిర్ణయించడమైనది. .
భక్తులు యావన్మంది గమనించి సౌకర్యార్ధము సాధ్యమైనంత వరకు అన్ని ఆర్జిత సేవ టిక్కెట్లు, దర్శనము టిక్కెట్లు, కేశఖండన టిక్కెట్లు, ప్రసాదము టిక్కెట్లు అన్నియు దేవస్థాన వెబ్ సైటు ఆన్ లైను ద్వారా (www.kanakadurgamma.org ) ద్వారా టిక్కెట్లు తీసుకొని వచ్చిన యెడల సౌకర్యముగా ఉండునని తెలియజేయడమైనది.

















