- గౌతమి మృతిపై విచారణాధికారి, ఏఎస్పీ రత్న
- వీడని అనుమానాలు
- పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానాలు దాటవేత
పాలకొల్లు(పశ్చిమ గోదావరి జిల్లా): హత్యకాదు.. రోడ్డు ప్రమాదమే.. దిగమర్రు వద్ద కారు ఢీకొని గౌతమి మృతి చెందిన సంఘటనపై ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 18న జరిగిన సంఘటన వివరాలు కేసు విచారణాధికారి, ఏఎస్పీ వై.రత్న గురువారం పాలకొల్లు రూరల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ప్రమాదమేనని తేల్చి చెప్పినప్పటికీ విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు.
పాలకొల్లు-నరసాపురం రహదారిలో దిగమర్రు వద్ద జ రిగిన సంఘటనలో గౌతమి మృతిచెందడం, ఆమె సోదరి పావని తీవ్రగాయాలతో బయట పడడం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కోలుకున్న అనంతరం పావని ఈ నెల 22న వివరాలు చెప్పింది. ప్రమాదం కాదని, ప్రణాళిక ప్రకారం హత్య చేశారని ఆరోపించింది. కాగా గురువారం ఏఎస్పీ రత్న విలేకర్ల సమావేశంలో ఇందుకు విరుద్ధంగా హత్య కాదు ప్రమాదమేనని తేల్చిచెప్పారు.
రెండు బృందాల విచారణ
హత్యకాదని రోడ్డు ప్రమాదమేనని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పోలీసులు విచారణ నిమిత్తం రెండు బృందాలను ఏర్పాటుచేసి విశాఖపట్నం, విజయవాడకు పంపించి విచారించామన్నారు. సీసీ పుటేజీ, టోల్ప్లాజా డేటా, పెట్రోల్ బంకుల వద్ద విచారించామన్నారు.
సజ్జా బుజ్జి ఫోన్కాల్స్ లేవు..
సంఘటన జరిగిన రోజు పాలకొల్లులోని కృష్ణభవాని ఆసుపత్రికి గౌతమి, పావని స్కూటీపై వచ్చారని ఏఎస్పీ తెలిపారు. గౌతమి వివాహం చేసుకున్న బుజ్జి అసలు ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు. బుజ్జి, మృతురాలి సోదరి పావనికి స్నేహితుడైన రమేష్ ఫోన్ కాల్స్ పరిశీలించామన్నారు. మొత్తం 13 ఫోన్కాల్స్లో పావని 10 ఫోన్ కాల్స్ రమేష్కు చేసిందని, రమేష్ మూడు కాల్స్ మాత్రమే చేశాడని తెలిపారు. బుజ్జి మొదటి భార్య శిరీష ఫో న్చేసి బెదిరించిన ఆరోపణల నేపథ్యంలో ఫోన్కాల్స్, ఎస్ఎంఎస్ డేటా పరిశీలించామని, వాస్తవం లేదన్నారు.
మద్యం మత్తులోనే..
ఈనెల 14న విశాఖపట్నంలో పాసల సందీప్ టాటా సఫారీని సత్యనారాయణ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశాడని, డ్రైవర్గా ప్రసాద్ అనే వ్యక్తిని నియమించుకున్నట్లు వివరించారు. 15న రాత్రి ఇద్దరు కలసి భీమవరంలో కోడి పందాలు చూసేందుకు వెళ్ళాడని, పాలకొల్లు రైల్వే బైపాస్ రోడ్డులో 16న కోడి పందాలు, గుండాట, పేకాట ఆడి అదికంగా మద్యం సేవించారని తెలిపారు. సమీపంలోని రా యల్ రెసిడెన్సీ లాడ్జీలో 17న సాయంత్రం వరకు విశ్రాం తి తీసుకుని విజయవాడ బయలుదేరారన్నారు.
విజయవాడలో సందీప్ అద్దెకు ఉండే ఇంటి ఓనరు రాధిక రాణి ఇంట్లో ఉన్నారని, 18న తిరిగి బయలుదేరి తాడేపల్లిగూడెం మీదుగా మొగల్తూరు చేరుకున్నారన్నారు. మొగల్తూరులో సందీప్ స్నేహితుడు కాటం సేవన్య అలియాస్ టోనీతో కలసి మద్యం సేవించి విశాఖపట్నం బయలు దే రారన్నారు. పాలకొల్లు రైల్వే బైపాస్ రోడ్డు వరకు వచ్చేసరికి మద్యం మత్తు కారణంగా వెనుతిరిగి మొగల్తూరు వెళుతున్నారని, ఈ క్రమంలో స్కూటీని ఢీకొనడంతో కం గారు, మద్యం మత్తులో 100 మీటర్ల వరకు కారును కం ట్రోల్ చేయలేకపోయారని, దీనితో గౌతమి మృతిచెందిందని తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు ఇదే చెప్పారు..
సంఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ సామాన్లు విక్రయించే ముత్యాలరాజు ప్రత్యక్షంగా చూశాడని, అతడి ని విచారించామని ఏఎస్పీ తెలిపారు. ప్రమాదమేనని చెప్పాడని, పండ్ల రసాలు విక్రయించే మరో వ్యక్తి కూడా ఇదే విషయం చెప్పాడన్నారు. తమపై ఏవిధమైన రాజకీయ ఒత్తిళ్ళు లేవని ఏఎస్పీ రత్న వివరించారు. కారు యజమాని, డ్రైవర్ తమ అదుపులో ఉన్నారన్నారు.
సమాధానాలు దాటవేత
ఈ నెల 14 నుంచి 18 వరకు కారులో తిరుగుతూ, లాడ్జీల్లో బస చేసిన వారికి దుస్తులు, ఇతర లగేజీ లేదా అని విచారణాధికారిని విలేకర్లు ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటలకే పుట్పాత్ వ్యాపారులు వెళ్ళిపోతే సుమారు రాత్రి 8.30 గంటలకు జరిగిన సంఘటనకు పండ్ల వ్యాపారి ఎలా ప్రత్యక్ష సాక్షి అని విలేకర్లు ప్రశ్నించారు. ప్రమాదం అనంతరం వారు కారులోంచి బయటపడి ఎక్కడికి.. ఎళా వెళ్ళారు అనే ప్రశ్నలకు ఏఎస్పీ రత్న సమాధానాలు దాటవేశారు. మద్యం మత్తులో ఉన్నవారు సంఘటనాస్థలం నుంచి స్థానికులకు సైతం దొరక్కుండా ఎలా పారిపోయారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. విలేకరుల సమావేశంలో పాలకొల్లు సీఐ ఎ.చంద్రశేఖరరావు, ఎస్ఐ ఆది ప్రసాద్, ఆచంట ఎస్ఐ ఏజీఎస్ మూర్తి, తదితరులు ఉన్నారు