ఐఎన్ఎస్వీ కౌండిన్య మస్కట్ చేరుకుంది – 5,000 ఏళ్ల భారత్–ఒమాన్ సముద్ర సంబంధాలకు పునరుజ్జీవనం


మస్కట్లోని పోర్ట్ సుల్తాన్ ఖబూస్ వద్ద ఐఎన్ఎస్వీ కౌండిన్య సిబ్బందిని స్వాగతించిన కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్
భారత నౌకాదళానికి చెందిన సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన నౌక ఐఎన్ఎస్వీ కౌండిన్య, పోర్బందర్ నుంచి తన తొలి సముద్ర ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసి మస్కట్ చేరుకుంది. ఇది భారత్–ఒమాన్ దేశాల మధ్య 5,000 సంవత్సరాల నాటి సముద్ర వారసత్వానికి ప్రతీకగా నిలిచింది.
ఈ నౌకతో పాటు సిబ్బందిని కేంద్ర పోర్టులు, నౌకా రవాణా & జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ మస్కట్లోని పోర్ట్ సుల్తాన్ ఖబూస్ వద్ద ఘనంగా స్వాగతించారు.
సాంప్రదాయంగా కుట్టిన పలకలతో నిర్మించిన ఈ పడవ ప్రయాణం, భారత్–ఒమాన్ దేశాల మధ్య ఉన్న లోతైన సముద్ర, సాంస్కృతిక మరియు నాగరిక సంబంధాలను మరోసారి గుర్తుచేస్తోంది. సముద్రాలు రెండు దేశాల మధ్య శతాబ్దాలుగా అనుసంధాన మార్గాలుగా నిలిచి, వాణిజ్యంతో పాటు సాంస్కృతిక పరస్పర సంబంధాలను పెంపొందించాయి. ఇరు దేశాలు దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సమయంలో ఈ యాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
ఈ సందర్భంగా మంత్రి శర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ,
“ఇది కేవలం ఒక సముద్ర ప్రయాణం కాదు, ఇది రెండు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరిక బంధానికి ప్రతీక. ఈ కుట్టిన పడవ మస్కట్ చేరడం భారత్–ఒమాన్ స్నేహానికి చారిత్రక గుర్తు. ఈ సంబంధం వాణిజ్యంతో బలపడింది, పరస్పర గౌరవంతో మరింత పటిష్టమైంది. ఐఎన్ఎస్వీ కౌండిన్య గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ దూరదృష్టికి నిదర్శనం అని అన్నారు.
ప్రఖ్యాత భారత సముద్రయాత్రికుడు కౌండిన్య పేరుతో నామకరణం చేసిన ఈ నౌక, భారతదేశపు స్వదేశీ సముద్ర విజ్ఞానం, శిల్పకళ మరియు సుస్థిర నౌక నిర్మాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.
పోర్టులో నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో ఒమాన్ వారసత్వం & పర్యాటక శాఖ అండర్సెక్రటరీ హిస్ ఎక్సలెన్సీ అజ్జాన్ అల్ బుసైది, భారత నౌకాదళం, ఒమాన్ రాయల్ నేవీ, రాయల్ ఒమాన్ పోలీస్ కోస్ట్ గార్డ్ మరియు ఇతర శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్, ఒమాన్ రవాణా, సమాచార సాంకేతిక శాఖ మంత్రి హిస్ ఎక్సలెన్సీ ఇంజి. సయీద్ బిన్ హమూద్ బిన్ సయీద్ అల్ మవాలితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య సముద్ర రంగ సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు.















