శబరిమల ఆలయంలోకి మహిళలందరికీ ప్రవేశం..
సుప్రీంకోర్టు సంచలన తీర్పు..శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు కీలకతీర్పు వెలువరించింది. మహిళలందరికీ ఆలయ ప్రవేశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నెలసరి కారణంగా 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకు శబరిమల దేవస్థానం విధించిన నిషేధాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4-1 మెజార్టీతో తీర్పు వెలువరించింది. మహిళలను దేవతలుగా పూజించే దేశం మనదని.. ఓ వైపు మహిళలను దేవతలుగా ఆరాధిస్తూనే మరోవైపు ఆంక్షలు విధిస్తున్నామని ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు. మతమనేది జీవన విధానంలో భాగమని, పురుషుల కంటే మహిళలు ఎందులోనూ బలహీనులు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘మహిళలకు నిషేధం విధించడం హిందూ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది. దేవుణ్ణి పూజించడంలో మహిళలు,పురుషులు అన్న తేడా ఉండదు. రుతుక్రమం వంటి శారీరక మార్పులను సాకుగా చూపి నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం’’ అని జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొన్నారు.