స్వశక్తితో అసాధారణ ప్రఙ్ఞా పాటవాలతో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా, తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు.
ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం.
ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న ఏటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొంటున్నాం.
ఆయన నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యా వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు.
ఎదుటివారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మిన వ్యక్తి సర్వేపల్లి.
కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారాయన. ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే.
అలాంటి బోధనావృత్తికి తలమానికంగా నిలిచిన సర్వేపల్లి గురించి క్లుప్తంగా..
సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీ. దూరంలోని తిరుత్తణిలో జన్మించారు.
ఇది తిరుపతి సమీపంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ. వీరాస్వామి నాటి జమీందారీ వద్ద తహసిల్దార్గా పనిచేసేవారు.
వీరి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యం, పాఠశాల విద్యాభ్యాసం తిరుత్తణి, తిరుపతిలోనే గడిచిపోయాయి.
ప్రాథమిక విద్య తిరుత్తణిలో పూర్తి చేసిన రాధాకృష్ణన్.. తిరుపతి, నెల్లూరులో తదనంతర విద్యాభ్యాసం సాగించారు.
మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టా పొందారు.
1906లో తన 16వ ఏట సర్వేపల్లి రాధాకృష్ణన్కు శివకామేశ్వరితో వివాహం జరిగింది.
వీరికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు.
ఆయన సతీమణి 1956లో తన 51వ ఏట మరణించారు.
రాధాకృష్ణన్ బాల్యం నుంచే అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు.
ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు.
విద్యార్థికి, ఉపాధ్యాయుడికీ మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిచి చెప్పారు ఆచార్య రాధాకృష్ణ. అధ్యాపకుడిగా, వైస్ ఛాన్సలర్గా,
దౌత్యవేత్తగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం, అనితరసాధ్యం.
ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను మనకు వెల్లడి చేస్తాయి.
సర్వేపల్లి 21 ఏళ్ల వయస్సులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు.
తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్గా ఆహ్వానించింది.
ఆయన ఉపన్యాసాలు విద్యార్థులనెంతో ఆకట్టుకునే.
సర్వేపల్లి ప్రతిభ గుర్తించిన డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్.. కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్య పదవి చేపట్టమని ఆయణ్ని కోరారు. వారి ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లారు.
అక్కడే ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది.
కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా ఉన్న సమయంలో సర్వేపల్లి ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథం రాశారు.
ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. ‘మీరు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకుని ఉంటే మీకు ఇంకా మరింత గొప్ప పేరు వచ్చేది’ అని ఒక మిత్రుడు అనగా.. సర్వేపల్లి ‘నేను ఆక్స్ఫర్డ్ వెళ్తే.. అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తా. విద్యార్థిగా మాత్రం కాదు’ అన్నారట.
సర్వేపల్లి దేశభక్తి, స్వదేశీ విద్యాలయాలపట్ల గౌరవం, ఆత్మాభిమానానికి ఈ ఘటనను మచ్చుతునకగా పేర్కొంటారు.
ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు సర్వేపల్లి ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు అక్కడికి వెళ్లారు.
ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి విదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి మాతృదేశ కీర్తిని పెంచిన ఘనత కూడా ఆయనదే.
1931లో డా. సి.ఆర్. రెడ్డి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లరుగా పనిచేశారు.
1931లోనే రాధాకృష్ణన్ ‘లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటీ’ సభ్యులుగా ఎన్నికయ్యారు.
1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యాపకులుగా పనిచేశారు.
1946లో సర్వేపల్లి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు.
1947 ఆగస్టు 14, 15 తేదీ మధ్య రాత్రి ‘స్వాతంత్ర్యోదయం’ సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం భారతీయులను ఎంతో ఉత్తేజపరిచింది.
1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డాక్టర్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించింది.
ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్టర్ రాధాకృష్ణన్ 1952-62 వరకు భారత ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. భారత్కు ఆయనే తొలి ఉప రాష్ట్రపతి.
ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్-రిఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫి, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ లాంటి అనేక గొప్ప గ్రంథాలు సర్వేపల్లి రచించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్
1962లో బాబూ రాజేంద్రప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అసమాన వాగ్ధాటితో, ప్రాచ్యపాశ్చాత్వ తత్వశాస్త్రాలపై ఆయన ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన