దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగస్టు 9న క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ బంద్, జైల్ భరోకు అఖిల భారత కిసాన్ సభ(ఎఐకెఎస్), ఆలిండియా అంబేద్కర్ మహాసభ(ఎఐఎఎం), ఇండియన్ ఎక్స్ సర్వీస్మ్యాన్ మూమెంట్(ఐఈఎస్ఎం) పిలుపు నిచ్చాయి. దేశవ్యాప్తంగా ఇతర వర్గాల మద్దతుతో ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు రైతులు, దళితులు, మాజీ సైనికులు ముందుకు వచ్చారు.. న్యాయం కోసం డిమాండ్ చేస్తూ ఉద్యమానికి పిలుపు నిచ్చారు. గురువారం నాడిక్కడ స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా మాట్లాడుతూ రైతులు, దళితులు, సైనికులు ఒకే వేదిక పైకి రావడం చారిత్రాత్మకమని అన్నారు. ఈ మూడు వర్గాలు ఒకే వేదిక మీదకు రావడం ఇదే తొలిసారి అన్నారు. రైతులకు పండించిన పంటకు పెట్టుబడికి 50 శాతం పెంచి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో రైతులందరికీ బ్యాంకు రుణాలు, కో-ఆపరేటివ్ రుణాలు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని వారికి భూమి ఇవ్వాలని, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. పునరావాసం, నష్టపరిహారం ఇవ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు, కారిడర్ ప్రాజెక్టులకు పేరుతో రైతుల వద్ద నుంచి బలవంతపు భూ సేకరణ ఆపాలని, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో గోరక్ష పేరుతో జరుగుతున్న దాడులను నివారించాలని, దాడులకు పాల్పడిన నిందితులను ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినది కూడా ప్రభుత్వమేనని అన్నారు. ఆలిండియా అంబేద్కర్ మహాసభ(ఎఐఎఎం) నేత అశోక్ భారతి మాట్లాడుతూ ఏప్రిల్2న భారత్ బంద్ సందర్భంగా భీం ఆర్మీ నేత చంద్రశేఖర్, శివ కుమార్ ప్రధాన్, సోను, ఉప్కార్ బవారీపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని పటిష్టపరచాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ప్రకారం ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ను ఏర్పాటు చేయాలని కోరారు.
ఇండియన్ ఎక్స్ సర్వీస్మ్యాన్ మూవ్మెంట్ (ఐఈఎస్ఎం) నేతలు మేజర్ జనరల్ సబీర్ సింగ్ (రిటైర్డ్), ప్రియందర్ సిన్హా చౌదరి మాట్లాడుతూ ఒఆర్ఒపిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ రోడ్డు ఆదేశాలను రద్దు చేయాలని, దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్(డిజిడిఈ)లో అవినీతిని కాగ్, సిజిడిఎ ద్వారా వెలికితీయాలని డిమాండ్ చేశారు. అందుకోసం దేశంలో 400 జిల్లాల్లో కిసాన్ సభ నేతృత్వంలో ఆగస్టు 9న ‘బిజెపి క్విట్ ఇండియా ‘ పేరుతో జైల్ భరో ఉద్యమం చేపట్టనుంది. ఆలిండియా అంబేద్కర్ మహాసభ అదే రోజున భారత్ బంద్కు పిలుపు నిచ్చింది