పడవ బోల్తా.. కొనసాగుతున్న సహాయచర్యలు ప్రతికూలంగా మారిన వాతావరణం యానాం వద్ద సహాయచర్యలు పర్యవేక్షిస్తున్న తూ.గో. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఐ.పోలవరం మండలం పశువుల్లంకమొండి వద్ద శనివారం సాయంత్రం గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గోదావరి పోటుతో ఉండటం, పాటు వర్షం కురుస్తుండటంతో సహాయచర్యలకు అంతరాయం కలుగుతోంది. అయినప్పటికీ సహాయ బృందాలు నదిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. స్థానిక మత్స్యకారుల సాయం కూడా అధికార యంత్రాంగం తీసుకుంటోంది. యానాం దిగువ, ఎగువ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్నీ, ఉన్నతాధికారులు సహాయచర్యలు పర్యవేక్షిస్తున్నారు.
ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈరోజు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు పర్యవేక్షించనున్నారు. గల్లంతైన వారు బతికే అవకాశం లేకపోవచ్చని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. శనివారం సాయంత్రం పశువుల్లంకమొండి వద్ద 40 మందితో గోదావరి దాటుతున్న పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు.
వీరిలో పాఠశాలల నుంచి తిరిగి వస్తున్న ఆరుగురు విద్యార్థినులు, ఓ గృహిణి ఉన్నారు. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతయిన విద్యార్థులంతా శేరిలంక, కమిని, సలాదివారిపాలెం, వలసలతిప్ప, సీతారాంపురం గ్రామాలకు చెందిన ప్రియ, మనీషా, సుచిత్ర, అనూష, శ్రీజ, రమ్య, దుర్గగా గుర్తించారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు, ఇతరులు వివిధ పనుల కోసం మురమళ్ల వచ్చి తిరిగి ప్రయాణమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పశువుల్లంక ఒడ్డు నుంచి సలాదివారిపాలెం గ్రామానికి సాయంత్రం 4.15 గంటలకు పడవ బయలు దేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతికి అదుపు తప్పిన పడవ అక్కడ నిర్మాణంలో ఉన్న వంతెన స్తంభాన్ని (పిల్లర్) ఢీకొట్టి ఒరిగిపోయింది. దీంతో కొంతమంది వంతెన పునాదిపైకి దూకి ప్రాణాలు కాపాడుకోగా మరికొంత మంది నీటిలో మునిగిపోతూ కేకలు వేశారు. సమీపంలోని వంతెన నిర్మాణ కార్మికులు మరో పడవలో వెళ్లి కొందరిని కాపాడి బయటకు తీసుకొచ్చారు.
మరికొందరు గల్లంతయ్యారు. కొంతమంది విద్యార్థులు పాఠశాల బ్యాగులు వెనుక తగిలించుకోవడంతో వాటి ఆధారంగా వారిని రక్షించగలిగారు.