భారత్ మరో విజయం సాధించింది. స్వదేశీ పరిజ్ఙానంతో అభివృద్ధి చేసిన అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 పరీక్షను ఆదివారం ఉదయం భారత్ విజయవంతంగా నిర్వహించింది.
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తోంది.
ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) లాంచ్ ప్యాడ్-4 నుంచి మొబైల్ లాంచర్ సాయంతో అగ్ని-5 క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
ఆరోసారి అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు వారు వెల్లడించారు.
రాడార్లు, ట్రాకింగ్ వ్యవస్థలు, క్షిపణి పనితీరును పరిశీలించినట్లు రక్షిణశాఖ వర్గాలు తెలిపాయి.
ఈ మిసైల్ దానికి నిర్దేశించిన పూర్తి దూరాన్ని కచ్చితత్వంతో చేరుకుందని దీంతో ప్రయోగం భారీ విజయం సాధించిందని వారు పేర్కొన్నారు.