రానున్న ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలే దేశమంతా పునరావృతమవుతాయని కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. బలనిరూపణను ముందే బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో కుప్పకూలిన విషయం తెలిసిందే.
యడ్డీ తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో మాట్లాడిన రాహుల్.. “కర్ణాటక విధాన సభలో ఏం జరిగిందో అందరూ చూశారు.
స్పీకర్, భాజపా ఎమ్మెల్యేలు జాతీయ గీతం ఆలపించకుండానే సభ నుంచి వెళ్లిపోయారు.
ఆర్ఎస్ఎస్, మోదీ, అమిత్షా కలిసి ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.
ఇవాళ ప్రజాస్వామ్యం గెలిచింది. కర్ణాటక ప్రజలకు అభినందనలు. దేవెగౌడ, జేడీఎస్ కార్యకర్తలకు అభినందనలు.
విపక్షాలన్నీ కలిసి వచ్చి ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాయి.
ఎమ్మెల్యేల కొనుగోలును ప్రధాని మోదీ ప్రోత్సహించారు.
ఎమ్మెల్యేలతో ఫోన్లో జరిపిన బేరసారాలు బహిర్గతం అయ్యాయి.
అవినీతి గురించి మాట్లాడే ప్రధాని.. కర్ణాటకలో అవినీతిని ప్రోత్సహించారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ భ్రష్టుపట్టించింది.
కర్ణాటకలో బీజేపీ ఆగడాలను అడ్డుకున్నాం. దేశ ప్రజలు, వ్యవస్థల కంటే ప్రధాని గొప్పవాడు కాదు..” అని రాహుల్ అన్నారు.