vizagvision:వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. యాభై రోజులకు జగన్ యాత్ర చేరుకుంది. యాభై రోజుల నుంచి జగన్ జనం వద్దనే ఉంటున్నారు. ఇప్పటికి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇక్క ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు, సదస్సులకు మంచి స్పందన వస్తుండటంతో వైసీపీ నేతల్లో జోష్ నింపుతోంది. జగన్ ప్రస్తుతం తంబళ్లపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చిత్తూరు జిల్లా చిన్న తిప్ప సముద్రంలో జరిగిన బహిరంగ సభకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాలనపై జగన్ విరుచుకుపడ్డారు.
ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న అంశాలను వేటినీ అమలు చేయడంలేదని, టీడీపీ వెబ్ సైట్ నుంచి మ్యానిఫేస్టోను తొలగించారని జగన్ ఆరోపించారు.
వైఎస్ కంటే ఒక అడుగు ముందే..
పేదలను ఆదుకున్నది ఒక్క వైఎస్ మాత్రమేనన్నారు. ముఖ్యంగా బీసీలకు న్యాయం చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, తన తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండడుగుల పేదల అభివృద్ధి కోసం ముందడుగు వేస్తానని జగన్ ప్రకటించారు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు హామీని నెరవేర్చలేదన్నారు. చేనేత కార్మికుల కోసం బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయిస్తానని చెప్పిన బాబు ఒక్క రూపాయి కూడా పెట్టలేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని చెప్పారు.
యాభై రోజు షెడ్యూల్ ఇదే..
49వ రోజు జగన్ పాదయాత్ర 14.5 కిలోమీటర్ల మేరకు సాగింది. 50వ రోజు జగన్ సీటీఎం నుంచి ప్రారంభించనున్నారు. సీటీఎంలో ప్రారంభయ్యే యాత్ర పులవాండ్లపల్లి, కసిరావుపేట, వాల్మీకిపురం, ఐటీఐ కాలని, పునుగుపల్లి, విటలాం, టీఎం లోయ, జమ్మిల వారి పల్లి మీదుగా కొనసాగనుంది. సోమవారం జగన్ యాత్రలో విద్యత్తు కాంట్రాక్టు ఉద్యోగులు కలిశారు. తమ సమస్యలను వివరించారు. పొరుగు రాష్ట్రంలో విద్యుత్తు కాంట్రాక్టుకార్మికుల ఉద్యోగులను క్రమబద్దీకరిస్తుంటే ఏపీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారంలోకి వస్తే పరిశీలిస్తామని ఈ సమస్యపై జగన్ స్పందించారు.