ఏపీలో వృద్ధి లక్ష్యంగా రియల్ ఎస్టేట్ ప్రణాళికలు

- జాతీయ పట్టణాభివృద్ధి సదస్సుకు ఏపీ సిద్ధం
విజయవాడ , ఫిబ్రవరి 2026: ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, పట్టణీకరణను జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం సిద్ధమైంది. ఈనెల 13, 14వ తేదీల్లో న్యూఢిల్లీలోని ‘యశోభూమి’లో జరగనున్న ‘జాతీయ పట్టణ, రియల్ ఎస్టేట్ అభివృద్ధి సదస్సు 2026’లో నరెడ్కో ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధులు పాల్గొననున్నారు. అమరావతి, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో జరుగుతున్న అభివృద్ధిని, పెట్టుబడి అవకాశాలను ఈ వేదిక ద్వారా దేశవ్యాప్త పారిశ్రామికవేత్తల ముందు ఉంచనున్నారు. ఈ సందర్భంగా నరెడ్కో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు జీ చక్రధర్ మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం స్థిరమైన వృద్ధిని సాధిస్తోందన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన రవాణా సౌకర్యాలు రాష్ట్రవ్యాప్తంగా పట్టణ కేంద్రాల వేగవంతమైన విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలు అన్నారు. క్వాంటం వ్యాలీలు, ఇన్నోవేషన్ హబ్లు, ఐటీ రంగం, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ కారిడార్లు, ఆటోమొబైల్ పరిశ్రమలు, ఎక్స్ప్రెస్వేలు, మెట్రో ప్రాజెక్టులు, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, వేర్హౌస్లు, లాజిస్టిక్స్, షిప్పింగ్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లలో వ్యూహాత్మక పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ తన పట్టణాభివృద్ధి ప్రయాణాన్ని, భవిష్యత్తు ప్రాధాన్యతలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు సిద్ధమవుతోందన్నారు. ఈ సదస్సు వివిధ రాష్ట్రాలు తమ అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలను పంచుకోవడానికి ఒక వేదికగా నిలవనుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ వేదికపై ప్రధానంగా ఈ క్రింది అంశాలను ప్రదర్శించనుందని పేర్కొన్నారు. పట్టణ మౌలిక సదుపాయాల బలోపేతం, గృహాల లభ్యతను పెంచడమన్నారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు వంటి నగరాలతో పాటు ఎదుగుతున్న ఇతర పట్టణ కేంద్రాల ప్రణాళికాబద్ధమైన వృద్ధి కూడా అన్నారు. మెట్రో రైలు విస్తరణ, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్ హబ్లు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లపై ప్రత్యేక దృష్టి ఉందన్నారు. సులభతర వాణిజ్యం, నియంత్రణ సంస్కరణలు, సాంకేతికతతో కూడిన పాలన ద్వారా రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం సాధించిన విజయాన్ని దేశవ్యాప్త పరిశ్రమల భాగస్వాముల ముందు ప్రదర్శించనున్నారని తెలిపారు. దేశ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం ఒక కీలక దశలోకి ప్రవేశిస్తోందన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన పట్టణీకరణ, ప్రభుత్వ అనుకూల విధానాలు దీనికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని తెలిపారు. 2047 నాటికి దేశంలో పట్టణీకరణ 50 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో సమర్థవంతమైన, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన పట్టణాభివృద్ధి వ్యవస్థల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పట్టణాలలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, పెట్టుబడిదారుల నమ్మకాన్ని బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక వృద్ధికి అవసరమైన కార్యాచరణను రూపొందించడమే ఈ సదస్సు లక్ష్యమన్నారు. మెట్రో రైలు, పారిశ్రామిక కారిడార్లు, విమానాశ్రయాలు, హైవే కనెక్టివిటీలో నిరంతర పెట్టుబడుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో పట్టణ రూపురేఖలు మారిపోతున్నాయని తెలిపారు. ఇది విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను వేగవంతం చేస్తోందన్నారు. మెరుగైన విధానాలు, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి ఫలితంగా నివాస, వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో కొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ సాధించిన పట్టణాభివృద్ధి అనుభవాలను పంచుకోవడానికి, సమగ్ర వృద్ధిపై జరిగే చర్చల్లో భాగస్వాములు కావడానికి నరెడ్కో ఆంధ్రప్రదేశ్ ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నరెడ్కో చైర్మన్ డాక్టర్ నిరంజన్ హిరానందని మాట్లాడుతూ భారతదేశ వృద్ధి పథంలో అత్యంత కీలకమైన సమయంలో ఈ 'జాతీయ పట్టణ మరియు రియల్ ఎస్టేట్ అభివృద్ధి సదస్సు 2026' జరుగుతోందని తెలిపారు. రియల్ ఎస్టేట్ అనేది కేవలం ఒక ప్రత్యేక రంగం మాత్రమే కాదని, ఇది ఆర్థిక విస్తరణకు, ఉపాధి కల్పనకు, పట్టణ పరివర్తనకు ప్రధాన చోదక శక్తిగా మారిందని పేర్కొన్నారు. రవాణా ఆధారిత అభివృద్ధి, నియంత్రణ సంస్కరణలు, సంస్థాగత పెట్టుబడులు, డిజిటల్ గవర్నెన్స్పై ఈ సదస్సులో జరిగే లోతైన చర్చలు భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యవస్థకు బాటలు వేస్తాయన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభా నేపథ్యంలో 'వికసిత్ భారత్ 2047' దార్శనికతకు అనుగుణంగా, విభిన్న వాటాదారులను, వినూత్న ఆలోచనలను ఒకచోట చేర్చి ప్రపంచ స్థాయిలో పోటీ పడగల స్థిరమైన పట్టణ వ్యవస్థను నిర్మించడానికి ఈ సదస్సు ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నరెడ్కో అధ్యక్షుడు ప్రవీణ్ జైన్ మాట్లాడుతూ నిర్మాణాత్మకమైన చర్చలు, ఆచరణాత్మక సంస్కరణల ద్వారా మాత్రమే స్థిరమైన పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సదస్సు ప్రధానంగా నియంత్రణల సమన్వయం, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ఈ రంగం తదుపరి దశ వృద్ధికి ఇవి అత్యంత అవసరం అన్నారు.













