మరో వేయి ప్రతిభా పురస్కారాలు…
విద్యార్ధులను ప్రోత్సహించేందుకు రూ. 30 కోట్లు: ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న కాలంలో విద్యార్ధుల ప్రతిభ ఆధారంగా పూర్తిగా చదివించే బాధ్యత తీసుకుంటామని, ఇప్పుడు ఇస్తున్న 6,500 ప్రతిభా పురస్కారాలను మరో 1000కి పెంచుతామని, ఇందుకోసం మరో 30 కోట్లు అదనంగా వ్యయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. విద్యార్ధులలో ఆత్మవిశ్వాసం పెంచాల్సి ఉందని, తల్లి దండ్రుల డబ్బులతో కాకుండా, విద్యార్ధులు తమ ప్రతిభా పురస్కారాలతో చదివే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి అన్నారు.
అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడ ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదాన వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలను బహూకరించారు. విద్యార్ధుల భవిష్యత్తుకు తపించిన వైజ్ఞానికుడు, మేధావి, భారత రాష్ట్రపతిగా పనిచేసి స్ఫూర్తిదాతగా నిలిచిన అబ్దుల్ కలాం జయంతినాడు ఈ పురస్కారాలను ప్రదానం చేయండ సముచితంగా ఉంటుందని భావించి ఈ కార్యక్రమానికి ముహూర్తంగా ఎంచుకున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఏ మంచిపని అయినా సంకల్పం తీసుకుంటే తప్పక నెరవేరుతుందని ఆయన అన్నారు. గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంలో తీసుకున్న సంకల్పాలు ఎలా ఫలప్రదమవుతున్న వైనాన్ని ముఖ్యమంత్రి వివరించారు.
తాము విద్యార్ధుల్లో ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలను మరో 1000 పెంచనున్నట్లు తెలిపారు. పదో తరగతిలో మెరిట్ స్కాలర్ షిప్ వచ్చిన వారిని ఇంటర్మీడీయట్ చదివిస్తామని ప్రకటించారు. ఇంటర్ లో మెరిట్ స్కాలర్ షిప్ వస్తే వాళ్లు తర్వాత ఏ కోర్సులో చేరాలన్నా సహకరిస్తామని, బిట్స్ పిలానీ, ఐఐటీ, ఐఐఎం ఎక్కడైనా చదివించడానికి సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. డిగ్రీ నుంచి పీజీకి వెళ్లినా, విదేశాల్లో అయినా చదివిస్తామని సీఎం స్పష్టం చేశారు. ధనికులైనా, పేదలైనా పిల్లల్లో విజ్ఞానాన్ని పెంచాలని కోరారు.