యావత్ కార్మిక లోకం గర్జించింది. కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విశాఖ నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో సరస్వతి పార్క్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ను ముట్టడించారు. ప్రస్తుత పరిస్థితులలో నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో చాలీచాలని జీతాలతో ఏ విధంగా కుటుంబాలు బ్రతకాలని ప్రభుత్వాలను నిలదీశారు. వేలాదిగ తరలివచ్చిన కార్మికులతో విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్మికుల గర్జనతో మారుమరోగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగ్ రావు మాట్లాడుతూ కోవిడ్ తర్వాత కార్మికులు కోరుకునే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. విపరీతంగా పెరిగిన ధరలతో కుటుంబాలను పోషించుకోలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులకు కనీస వేతనాలు 26 వేల రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కనీస వేతన సలహా బోర్డు ఎందుకు నియమించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల సెస్సు డబ్బులు వాడుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు అని నిలదీశారు. వాహన మిత్ర పథకం ఒక బోగస్ అని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన ఈ మూడు సంవత్సరాలు కార్మికుల జీతాలు ఒక్క పైసా కూడా పెంచలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలని కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.