ఎన్యూజేఐ జర్నలిజం స్కూల్ గవర్నింగ్ కౌన్సిల్ లో ఎస్ఎస్ఆర్కు మరోసారి స్థానం,Vizagvision…
సీనియర్ జర్నలిస్ట్ ఎస్.నాగేశ్వరరావు ( ఎన్ఎస్ఆర్ ) కు మరో అరుదైన బాధ్యత వరించింది . నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా ( ఎన్యూజేఐ ) ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న స్కూల్ ఆఫ్ జర్నలిజం ( ఎఓజే ) గవర్నింగ్ కౌన్సిల్ లో ఎన్.ఎస్.ఆర్.కు స్థానం దక్కింది . వరుసగా రెండవ పర్యాయం ఈ గౌరవాన్ని ఆయన దక్కించుకున్నారు . దేశ రాజధాని కొత్త ఢిల్లీ కేంద్రంగా 1992 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జర్నలిజం స్కూల్ కు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి . జాతీయ స్థాయిలో ప్రముఖ ఆంగ్ల పత్రికలకు చెందిన పేరెన్నికగన్న సంపాదకులు జర్నలిజం స్కూల్ అధ్యక్షులుగా సేవలందించారు . ఎన్యూజేఐ ఉపాధ్యక్షునిగా వరుసగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్.ఎన్.ఆర్.ను జర్నలిజం స్కూల్ పాలకమండలి సభ్యునిగా తీసుకుంది . జర్నలిజం స్కూల్ పూర్వ గవర్నింగ్ కౌన్సిల్ లో ఎన్.ఎన్.ఆర్ . కీలక బాధ్యతలు నిర్వహించారు . ఆయన సేవలను గుర్తించిన పాలకమండలి మరోసారి కౌన్సిల్ లోకి తీసుకుంది . ఈనెల 24 వ తేదీన జరిగిన జర్నలిజం స్కూల్ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది . ఎన్యూజేఐ అధ్యక్షులు మనోజ్ మిశ్రా ( ఢిల్లీ ) ప్రధాన కార్యదర్శి సురేష్ శర్మ ( లక్నో ) , ఎన్యూజేఐ పూర్వ అధ్యక్షులు ప్రెస్ కౌన్సిల్ పూర్వ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ ( హైదరాబాద్ ) , జర్నలిజం స్కూల్ పూర్వ అధ్యక్షులు విజయ్ క్రాంతి ( ఢిల్లీ ) ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది . ఎన్యూజేఐ పూర్వ అధ్యక్షులు , ప్రముఖ సంపాదకులు అశోక్ మల్లిక్ ( చంఢీఘడ్ ) స్కూల్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు . అధ్యక్షుడు సహా ఇరువురు ఉపాధ్యక్షులు , కార్యదర్శి , కోశాధికారి మరో తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులతో నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది . ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్.ఎస్.ఆర్ . తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.రాజేంద్రనాథ్ కార్యవర్గంలో స్థానం దక్కించుకున్నారు . ఈ సందర్భంగా ఎన్యూజేఐ పూర్వ అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్ కు ఎన్.ఎన్.ఆర్ . ధన్యవాదాలు తెలియజేశారు . ఎన్యూజేఐ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్న శుభ తరుణంలో స్కూల్ ఆఫ్ జర్నలిజం గవర్నింగ్ కౌన్సిల్ లో స్థానం లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు . దేశం వ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులకు మెరుగైన వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఎన్యూజేఐ జర్నలిజం స్కూల్ కృషి చేస్తుందని ఎన్.ఎన్.ఆర్ . తెలిపారు . స్కూల్ ఆఫ్ జర్నలిజంలో స్థానం సంపాదించుకున్న ఎన్.ఎన్.ఆర్.ను జాప్ రాష్ట్ర కార్యవర్గం , విశాఖపట్నం కార్యవర్గం శుభాకాంక్షలు తెలియజేసింది .