ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి వేడుక అనేది ఒక మధురానుభూతి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో మతంలో ఒక్కో విధంగా పెళ్లి వేడుకలు చేసుకోవడం మనం చూసాం. అయితే హిందూ సంప్రదాయంలో జరిగే పెళ్లిళ్లకు ఒక ప్రత్యేకత ఉంది. పెళ్ళికి గోధుమ రాయి వేయడం నుంచి తాళి కట్టే బ్రహ్మ ముహూర్తం వరకు జరిగే ప్రతీ ప్రక్రియ ఒక తంతే. ప్రస్తుత ఆధునిక పోకడలతో ఆర్య సమాజ్… రిజిస్ట్రేషన్ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. దీనితో సంప్రదాయ పెళ్లిళ్లపై నేటి యువతకు అవగాహన తగ్గిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పెళ్లి తతంగంపై నేటి యువతను అవగాహన పెంపొందించాలనే ఆలోచనతో బొమ్మల కొలువు నిర్వహించింది విశాఖలోని ఒక కుటుంబం. గోధుమ రాయి వేయడం నుంచి పసుపు దంచడం… మంగళ స్నానాలు… పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును తయారు చేయడం… పెళ్లి పీటలపై కూర్చోవడం… తాళి కట్టడం… ఇలా ప్రతీ వేడుకను కళ్ళకు కట్టినట్టు బొమ్మల రూపంలో ఇక్కడ ప్రదర్శించారు. కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో ప్రక్రియను తయారు చేసి బొమ్మల కొలువులో ఉంచారు. ఈ వేడుకను చూసేందుకు యువత ఆసక్తి ప్రదర్శించారు. తమ కుటుంబంలో జరిగే ఒక పెళ్లి వేడుకలో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించారు.
పూర్వం కాలంలో మూడు నుండి ఐదు రోజులు పెళ్లిళ్లు చేసుకొనేవాళ్ళని మనం విన్నాం. ఆర్ధిక భారం, సమయాభావంతో ఇప్పుడు ఒక్క రోజుకే పరిమితమయ్యాయి పెళ్లిళ్లు.