ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
కాపులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
ఈ పథకం ద్వారా కాపు సామాజికవర్గం మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం ద్వారా రానున్న ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.75వేల సాయం అందించనున్నారు.
బుధవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.
నవశకం సర్వే ద్వారా వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కోటాయించామన్నారు. 10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి, 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని వివరించారు.
అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ నడుపుకునేవారికి మినహాయింపు ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించినట్లు నాని తెలిపారు.
జగనన్న వసతి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ ఆపైన చదువుకునే విద్యార్థులకు రూ.20వేల ఆర్థికసాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అదేవిధంగా ఇళ్ల పట్టాలపై హక్కు కల్పిస్తూ పేదలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలిపారు.
ఇకపోతే మద్యం ధరల పెంపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు.
కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
స్టీల్ ప్లాంట్ కోసం 3,295 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించామని, ఇనుప ఖనిజం కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు.
డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరుగుతుందన్నారు.
టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.