కోస్తాంధ్ర, ఒడిశాను తిత్లీ తుపాను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నఈ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. దీంతో కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల్లో ఏడో నంబర్.. విశాఖ, గంగవరం ఓడరేవుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. తిత్లీ తుపాను కళింగపట్నానికి 230కి.మీ, గోపాల్పూర్కు 280 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయం కళింగపట్నం- గోపాల్పూర్ మధ్య తుపాను తీరం దాటే అవకాశముంది.
దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి 100 నుంచి 130 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని, గాలుల తీవ్రత 145 కి.మీ వరకు పెరిగే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్-హవ్డా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ను కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్, బిలాస్పూర్ మీదుగా దారి మళ్లించారు.