అవిశ్వాసంపై చర్చలో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో మాట్లాడుతుండగా స్పీకర్ సుమిత్ర మహాజన్ అడ్డు తగిలారు. మీకు ఎంత సమయం కేటాయించానని ప్రశ్నించారు. తనకు మరింత సమయం కావాలని గల్లా సమాధానమివ్వగా.. కుదరదని స్పీకర్ చెప్పారు. మరో 5నిమిషాల్లో ముగించాలని సూచించారు. గతంలో అవిశ్వాసంపై చర్చ జరిగినప్పుడు గంట కంటే తక్కువగా ఎవరూ చర్చ జరపలేదని, తాను రికార్డులను పరిశీలించే మాట్లాడుతున్నానని గల్లా చెప్పారు. హిస్టరీ గురించి మాట్లాడటం కాదని.. వర్తమానం గురించి మాట్లాడండని గల్లాకు స్పీకర్ చెప్పారు
విభజన పాపం కాంగ్రెస్దే కాదు… బీజేపీది కూడా అని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఎంపీ ఏపీ సమస్యలపై మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయని అన్నారు. కేంద్రం చేయాల్సినంత సాయం చేసి ఉంటే ఏపీ మరోలా ఉండేదని ఆయన అన్నారు. ఉమ్మడి ఏపీకి ఆదాయ వనరుగా హైదరాబాద్ ఉండేదని, హైదరాబాద్లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణకు పోవడం వల్ల ఏపీ ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని పేర్కొన్నారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని గల్లా తెలిపారు.
రాజ్యసభలో ఆనాడు ప్రధాని మన్మోహన్ ఆరు హామీలు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. పారిశ్రామిక రాయితీలు, పోలవరం ముంపు మండలాల విలీనం, రెవెన్యూలోటు పూడుస్తామని హామీలు ఇచ్చారని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 2014లో తెలుగుతల్లిని నిలువునా చీల్చిందని, కాంగ్రెస్ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని ఆనాడు మోదీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు.
ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని 2018లో జైట్లీ తేల్చి చెప్పారన్నారు. ఆర్థిక సంఘం అభ్యంతరాలను సాకుగా చూపారని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తమకు లేదా అని గల్లా ప్రశ్నించారు. విపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.
టీడీపీ నాలుగు కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. కేంద్రం ఏపీకి న్యాయం చేయకపోవడం మొదటి కారణమని, నమ్మకం లేకపోవడం రెండో కారణమని తెలిపారు. ఏపీకి ప్రాధాన్యం దక్కకపోవడం మూడో కారణమని, ఏపీపై కేంద్రం చూపుతున్న వివక్ష నాలుగో కారణమని గల్లా జయదేవ్ వివరించారు.
లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు మొదట ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజు అని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటికి రాగానే మాపై కక్ష గట్టారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం విస్మరించిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రాపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని గల్లా చెప్పుకొచ్చారు. అవిశ్వాసం అనేది బీజేపీ-టీడీపీ మధ్య వార్ కాదని.. మెజారిటీ-మొరాలిటీ మధ్య జరుగుతున్న యుద్ధమని గల్లా వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలపై నిలబడాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తలుపులుమూసి మరీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘటనను ఆయన సభలో మరోసారి ప్రస్తావించారు. ఏపీ ప్రజల ధర్మ పోరాటాన్ని పెద్దలు గ్రహించాలన్నారు. గల్లా జయదేవ్ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ ఎంపీలు మధ్యలో జోక్యం చేసుకొని ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కాసేపు సభ రసాబాసగా మారింది. అంతకముందు ‘భరత్ అనే నేను’ మూవీ స్టోరీని గల్లా పార్లమెంట్లో ప్రస్తావించారు.
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బిజూ జనతా దళ్ (బీజేడీ) లోక్సభ నుంచి వాకౌట్ చేసింది. చర్చలోని అంశాలకు ఒడిశాతో సంబంధం లేనందున సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించింది. బీజేడీ సభ్యులు సభనుంచి వెళ్లిపోవడం చూసి ప్రధాని నరేంద్ర మోదీ ముసిముసి నవ్వులు నవ్వడం గమనార్హం.
కాగా సభ ప్రారంభం కాగానే టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చ చేపట్టారు. తొలుత సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా మాట్లాడాల్సిందిగా స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఇవాళ సాయంత్రం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది. చర్చ నేపథ్యంలో సభ్యులకు లంచ్ విరామం కూడా ఉండకపోవచ్చని తెలుస్తోంది. కాగా ప్రతిపక్షాలకు కేటాయించిన సమయంలో అన్ని అంశాలు ప్రస్తావించేందుకు వీలుకాదంటూ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు.