బీజేపీపై సీఎం చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేశారు. ఏపీలో ఆ పార్టీ కుట్ర పన్నుతోందని చెప్పారు. బెంజిసర్కిల్లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో సీఎం మాట్లాడారు. ‘‘కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి అద్దె మైకుగా వైసీపీకి సొంతమైకుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు.
ఈ మధ్య కన్నా మీడియాతో మాట్లాడుతూ సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా వాళ్ల పార్టీలో ఉన్నట్లుగా మాట్లాడారు.
ప్రధాని మోదీ, అమిత్షా ఎవరు సీఎంను చేస్తే వారు అవుతారని చెప్పారు.
ఆ మధ్య నటుడు శివాజీ ‘ఆపరేషన్ గరుడ’ గురించి చెప్పారు.
నాకు ఇప్పుడు అనిపిస్తోంది ఆ ‘ఆపరేషన్ గరుడ’నే ఈ మహకుట్ర.
నేను ఒకటే కోరుతున్నాను మీరు కుట్రలు చేస్తే వేరే రాష్ట్రాల్లో ప్రయోగాలు చేయండి.
మా తెలుగుజాతి జోలికి వస్తే ఖబద్ధార్ జాగ్రత్తగా ఉండండి.
కుట్రలు చేస్తే వదిలిపెట్టబోమని ఈ నవనిర్మాణ దీక్షలో హెచ్చరిస్తున్నాను’’ అని ఆవేశంగా చంద్రబాబు మాట్లాడారు.
ఇటీవల ఓ జాతీయ పార్టీ ఏపీపై గురిపెట్టి ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో రంగంలోకి దిగుతోందని మ్యాప్ గీసి మరీ.. నటుడు శివాజీ పెద్ద హడావుడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చే జరిగింది.