నయన మనోహరంగా.. కోటి దీపోత్సవం…!
* ఇల కైలాసంలా ఇంద్రకీలాద్రి పరిసరాలు
* కార్తీక దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందిన కనకదుర్గ ఆలయం
* జ్యోతులు వెలిగించి అమ్మకు నీరాజనాలు సమర్పించిన భక్తులు
* అఖంఢ దీపం వెలిగించిన స్వరూపనంద స్వామి
సెల్ఐటి న్యూస్, ఇంద్రకీలాద్రి: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్దానంలో గురువారం సాయంత్రం నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమం నేత్రపర్వంగా కొనసాగింది. జై..దుర్గ..జైజై..దుర్గ అంటూ వేలాది మంది భక్తుల నామస్మరణ నడుమ కోటి కాంతులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విశాఖ శారదపీఠం పీఠాధిపతి స్వరూపనంద స్వామి పాల్గొని అఖంఢ దీపాన్ని వెలిగించారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, ధర్మకర్తల మండలి ఛైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, పాలకమండలి సభ్యులు పాల్గొని దీపార్చన గావించారు. కార్తీక పౌర్ణమి సందర్బంగా కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాలను విభిన్న రంగవల్లులతో తీర్చిదిద్దారు. శివలింగాకారం, త్రిశూలం ఆకారాల్లో రంగవల్లులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని ఆలయ చరిత్రలో ఇది మూడోసారి దేవస్దానం వారిచే వైభవంగా నిర్వహించబడిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ ఈవో కుమార్తె దేవిశ్రీ ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా చంద్రునికి ప్రత్యేక పూజలు, పాలు సమర్పించారు. చిన రాజగోపురం, మహాగణపతి విగ్రహం, గోకులం, ప్రధాన ఆలయం, విఐపి ప్రాకారం (అష్ట లక్ష్ములు), నూతన రాజగోపురం ముందు భాగం, కళావేదిక ప్రాగంణం, నటరాజ ఆలయం, శ్రీ మల్లేశ్వరాలయం, అర్జున వీధి ప్రారంభం నుండి మహా మండపం వరకు మాడవీధికి ఇరువైపులా వంటి ఆయా ప్రదేశాలను రంగురంగుల రంగవల్లికలతో తీర్చిదిద్దారు. కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఇన్ఛార్జ్ పీఆర్వో బలరామ్ను ప్రత్యేకంగా అభినందించారు. కార్తీక దీపార్చన ముగింపు అనంతరం భక్తులకు పులిహోర, దద్దోజనం ప్రసాదాలను పంపిణి చేశారు.