ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రభుత్వ పని తీరుపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించబోవని విశ్వసిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తమ ప్రభుత్వం మళ్ళీ గద్దెనెక్కుతుందని చెప్తున్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు.
ప్రతిపక్షాల మహా కూటమి అనేది విఫలమైన ఆలోచన అని చెప్పారు. ఈ ప్రయత్నాలేవీ ఫలించవన్నారు. ప్రజలు బలమైన, నిర్ణయాలు తీసుకోగలిగిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారన్నారు. సత్ఫలితాలిచ్చే ప్రభుత్వం కేంద్రంలో ఉండాలనుకుంటున్నారన్నారు. సిద్ధాంతాలేవీ లేని నిరాశావాదుల కూటమి మహా కూటమి కాబోదన్నారు.
సామూహికంగా వెళ్ళి, ఓ వ్యక్తిని చంపడం నేరమని, వారి ఉద్దేశాలు ఏమైనప్పటికీ అది మహా నేరమని చెప్పారు. అస్సాంలో జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ)ని ఆధునికీకరిస్తామని తెలిపారు.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ‘అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి, అందరికీ అభివృద్ధి’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్తామన్నారు. గతంలో ఎన్డీయే సాధించిన స్థానాల కన్నా అధిక స్థానాలను ఈసారి గెలుస్తామన్న భరోసా తనకు ఉందన్నారు. గత రికార్డులను బద్దలు చేస్తామన్నారు.