భార్య మరణం తట్టుకోలేక రెండు గంటల వ్యవధిలో భర్త మృతి
ఆరిలోవ దుర్గాబజార్ వద్ద ఘటన
విశాఖపట్నం: పెద్దల సమ్మతితో బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఆర్భాటంగా వివాహము చేసుకుంటున్న దంపతులు,ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకొని కొన్ని రోజులు గడవక ముందే పెళ్లి పెటాకులు చేసుకుంటున్న జంటలు ఇప్పుడు మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా కలకాలం జీవించే భార్యభర్తలు అరుదుగానే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి అరుదైన జంట ఆరిలోవ దుర్గాబజార్ వద్ద ఆదివారం సాయంత్రం కేవలం రెండు గంటల వ్యవధిలో
కన్నుమూసిన ఘటన చోటుచేసుకుంది.
తొలుత చింతలపూడి నాగయ్యమ్మ (67)
అనారోగ్యంతో మృతి చెందగా భార్య మరణాన్ని
తట్టుకోలేక భర్త సాంబమూర్తి(75) మరణించారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ దంపతుల సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆస్తుల కోసం, ఉద్యోగం కోసం, అక్రమ సంబంధాల కోసం,తుదకు ఫించన్ కోసం సైతం భర్తను భార్య..,భార్య భర్తను నిర్దాక్షిణ్యంగా అంతమొందిస్తున్న ఈ రోజుల్లో
భార్య మరణాన్ని తట్టుకోలేక రెండు గంటల వ్యవధిలో భర్త మరణించడం ఆ పుణ్య దంపతుల ప్రేమానురాగాలు ఎంత బలమైనవో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.